Friday, April 26, 2024
Friday, April 26, 2024

రుషికొండ ఏరియా భారత్‌`పాక్‌ సరిహద్దా…?

పరిశీలిస్తే తప్పేంటి
అక్రమ తవ్వకాలు నిజం కాబట్టే పోలీసులతో అడ్డగింతలు
ప్రభుత్వం తీరుపై సీపీఐ నేత నారాయణ ఆగ్రహం

విశాలాంధ్రవిశాఖపట్నం: నగరంలో ప్రకృతి అందాలకు నెలవైన రుషికొండ ఏరియా భారత్‌పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన విధ్వంసానికి గురవుతున్న రుషికొండను సందర్శించాలని సీపీఐ శ్రేణులతో కలసి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి బయలు దేరారు. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన నగర పోలీసులు దారి పొడవునా ఆయన్ను అనుసరిస్తూ రుషికొండ జంక్షన్‌ వద్ద వందలాది మందితో నారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని అటకాయించారు. తవ్వకాలు జరుగుతున్న రుషికొండకు వెళ్లకుండా నిలువరించారు. ఇందుకు స్పందించిన నారాయణ తమను ఎందుకు ఆపుతున్నారని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికొండ ఏమైనా పాక్‌ సరిహద్దులో ఉందా అని నిలదీశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను, రోప్‌వేలను దాటుకుంటూ ముందుకెళుతున్న తరుణంలో మధురవాడ ఏసీపీ శ్రీనివాస్‌ సీపీఐ నేతలతో ఈ పర్యటనకు ముందస్తు అనుమతులు లేని కారణంగానే రుషికొండకు వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నారు. రుషికొండను తాము పరిశీలించడానికి వెళితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని నారాయణ పోలీసులను ప్రశ్నిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు రోప్‌వేలతో నారాయణ సహా పార్టీ శ్రేణులను అడ్డుకోవడంతో సీపీఐ నేతలు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రకృతిని నాశనం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ ప్రకృతి అందాలతో, స్వయం సమృద్ధి పొందుతున్న నగరంపై ప్రభుత్వం కక్షకట్టిందన్నారు. అందాలకు నెలవైన కొండలను అక్రమంగా తవ్వేస్తూ నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ఐదు ఎరాకలల్లో నిర్మాణాలకు అనుమతులు పొందిన పర్యాటక విభాగం 30 ఏకరాలకు పైగా కొండను తవ్వి రుషికొండను పూర్తిగా నామరూపాలు లేకుండా చేసిందని విమర్శించారు. తవ్వడానికి కూలీలకు సొమ్ము చెల్లిస్తున్నామని చెపుతున్న యంత్రాంగం తవ్వి తీసిన గ్రావెల్‌ను అక్రమంగా అమ్ముకుంటూ వంద కోట్లు దండుకుంటోందని చెప్పారు. ఆ సొమ్ము ఎక్కడకి వెళుతోందో సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. కోర్టులు కూడా ప్రకృతి విధ్వంసాన్ని తప్పుపడుతున్న తరుణంలో అవేమీ పట్టని సీఎం జగన్‌ తన దుర్మార్గమైన విధానాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. రుషికొండలో అక్రమతవ్వకాలు నిజమని తేలితే జైలు తప్పదని కోర్టులు హెచ్చరించినా అధికారులకు భయం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రకృతిని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రుషికొండలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వమే అక్కడ అక్రమ నిర్మాణాలను చేపడితే ప్రకృతిని కాపాడేది ఎవరని ప్రశ్నించారు. ప్రజలను, రాజకీయ పార్టీల నేతలను రుషికొండను చూడడానికి కూడా అనుమతించకపోవడంతో ఆ ప్రాంతంలో ఆసాంఘిక కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అటువంటిది ఏమీ లేకపోతే తమను ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడం దారుణమన్నారు. ప్రకృతిని నాశనం చేయడం ఉరి శిక్షకు సమానమైన నేరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, కార్యవర్గ సభ్యులు ఎ విమల, కె సత్యాంజనేయ, ఎస్‌కే రెహమాన్‌, పి చంద్రశేఖర్‌, ఆర్‌ శ్రీనివాసరావు, సీఎన్‌ క్షేత్రపాల్‌, పార్టీ నేతలు ఎస్‌ మురళి, వై రాంబాబు, జా పణీంద్ర, యు నాగరాజు, ఎం మన్మధరావు, వై త్రినాధ్‌, వి సత్యనారాయణ, ఎ ఆదినారాయణ, ఎంఎస్‌ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img