అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, గత కొన్ని నెలలుగా 110 డాలర్లకు పైనే ఉండడం విమానయాన సంస్థలను (ఎయిర్ లైన్స్) తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. దీంతో తక్కువ ధరకే విమాన ప్రయాణాన్ని అందిస్తున్న దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ టికెట్ ధరలు పెంచింది.డాలర్తో రూపాయి మారకపు విలువ పడిపోవడం, ఫ్యూయల్ ధరలు అధికమవడంతో సంస్థకు నిర్వహణ వ్యయం పెరిగిందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే టికెట్ ధరలు పెంచామని అని జెట్ ఎయిర్వేస్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. దీనివల్ల తమకు కొంతవరకు భారం తగ్గుతుందని చెప్పారు. కనీసం 10-15 శాతం వరకు పెరగొచ్చని పేర్కొన్నారు. 2021 జూన్ నుంచి ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర 120 శాతానికి పైనే పెరిగినట్టు తెలిపారు. మరోవైపు ఏటీఎఫ్ ధరను 16.3 శాతం పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గురువారం ప్రకటించాయి. దీంతో దిల్లీలో కిలో లీటర్ జెట్ ఏటీఎఫ్ ధర రూ.1.41 లక్షలకు చేరింది. దీంతో ఇప్పటికే వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయని చెబుతున్న ఎయిర్ లైన్ సంస్థలపై మరింత భారం పడనుంది. దీంతో విమాన ప్రయాణికులు తమ జేబు నుంచి అధికమొత్తాన్ని ఖర్చు చేయక తప్పేలా లేదు.