Friday, April 26, 2024
Friday, April 26, 2024

విలీన చిక్కులు

ప్రాథమిక పాఠశాలలు అలంకార ప్రాయమే

హైస్కూళ్లకు గదుల కొరత
బడుల అభివృద్ధితో రూ.3వేల కోట్ల వృథా
మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల భేటీ
117`జీఓ సవరణకు అంగీకారం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో ప్రాథమిక పాఠశాలల భవనాలు అలంకార ప్రాయంగా మారనున్నాయి. మరోవైపు ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల కొరత తీవ్రం కానున్నది. 3,4,5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనానికి ప్రభుత్వం సన్నద్ధమవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్‌ఈపీ విధివిధానాలను అమలు చేస్తూ ప్రభుత్వం 117 జీఓ జారీ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ జీవోకు సంబంధించిన విధివిధానాలు అమలు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్‌ అన్ని మండల విద్యాధికారులను ఆదేశించడం విమర్శలకు దారితీస్తోంది. ఇది పూర్తిగా అమలులోకి వస్తే ప్రాథమిక పాఠశాలలు ఉనికి కోల్పోయే ప్రమాదముంది. నాడునేడు కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.3వేల కోట్ల నిధులతో పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఉపాధ్యాయుల ఖాళీలు కుదించుకుపోతాయి. ప్రతి మండలంలోని ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు రెండు/మూడు పాఠశాలలు ఎగిరిపోతున్నాయి. ప్రాథమిక బడుల్లో పనిచేసే ఎస్జీటీల పదోన్నతి హామీ ఎంతవరకు అమలవుతుందనేదీ ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జగన్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నప్పటికీ ఇంతవరకు ఒక్క డీఎస్సీకి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. వాటి కోసం లక్షలాది మంది ఉపాధ్యాయ శిక్షణార్థులు వేచిచూస్తున్నారు. అదే జరిగితే పాఠశాలల విలీనం వల్ల ఉపాధ్యాయ పోస్టులు భారీగా తగ్గిపోయే ప్రమాదముంది.
బొత్సతో చర్చలు అసంపూర్ణం
ప్రాథమిక పాఠశాలల విలీనంపై గురువారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 6, 7, 8 తరగతులకు ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం కొనసాగుతుందని మంత్రి బొత్స తేల్చిచెప్పారు. 9,10 తరగతుల్లోనే ఇంగ్లీషు, తెలుగు మీడియాలు ఉంటాయి. 18 తరగతుల వరకు తెలుగు మీడియం ప్రవేశపెట్టాలన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనను మంత్రి తోసిపుచ్చారు. చర్చల వివరాలను పరిశీలిస్తే...21 మంది ఉన్న పాఠశాలలకు రెండో ఎస్జీటీ పోస్టు ఇచ్చారు. కిలోమీటరు పరిధిలోని 3-5 తరగతులను సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం ఆగదు. 6 నుంచి 8 తరగతుల వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రభుత్వం యథాతథంగా అమలు చేయనుంది. జీవో117కు ఒకటి, రెండు రోజుల్లో మార్పులు చేసి ఉత్తర్వులు ఇచ్చే అవకాశముంది. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను 1:20గా చూస్తారు. 21 సంఖ్య దాటితే రెండో పోస్టు ఇస్తారు. ప్రీహైస్కూళ్లలో 98 రోల్‌పై ఉన్న చోట ఆరుగురు స్కూల్‌ అసిస్టెంట్‌, ఒక పీఈటీని ఇస్తారు. 998 ఉన్నత పాఠశాలల్లో ఖాళీల ఉన్నతీకరణకు, స్కూల్‌ అసిస్టెంట్‌5419 ఖాళీల ఉన్నతీకరణ కోసం ఆర్థికశాఖకు దరఖాస్తు చేయనున్నారు. అనుమతి రాగానే పదోన్నతులిస్తారు. 2342 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను తత్సమాన పోస్టులకు మారుస్తారు. అన్ని ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయ నియామకాలు క్రమపద్ధతిలో నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల బదిలీలకు జూన్‌ 30గా తుది గడువు విధించారు. తెలుగు మీడియం కొనసాగించాలి: ఎస్టీయూ 6 నుంచి 8 తరగతుల వరకు తెలుగు మీడియం యథాతథంగా కొనసాగించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జీవో117పై జరిగిన చర్చల్లో విద్యాశాఖమంత్రి కొన్నింటికే సానుకూలంగా స్పందించారని వివరించారు. 6`8 తరగతులను ఇంగ్లీషు మీడియంగా కొనసాగించడం రాజకీయ నిర్ణయంగా మంత్రి బొత్స చెప్పారన్నారు. ఉపాధ్యాయ సంఘాలు చాలా సూచనలు చేసినప్పటికీ, అందులో కొన్నింటికే మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణనలోకి తీసుకుని, త్వరలో ముసాయిదా ప్రతిని అందచేస్తారన్నారు. విలీన ప్రక్రియతో నష్టపోయే ఉపాధ్యాయులకే ప్రత్యేక పాయింట్లు ఇస్తారని, మిగిలిన వారికి హేతుబద్ధీకరణ పాయింట్లు ఇస్తామని తెలిపారు. ఏకోపాధ్యాయులుగా మారుతున్న పాఠశాలల్లో 20పైన హాజరు ఉంటే రెండో పోస్టు తప్పనిసరిగా మంజూరు చేయాలని కోరగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img