ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయిదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఆయన రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపారు. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జబల్పుర్ వెళ్లే రెండు వందేభారత్ రైళ్లకు ప్రధాని మోదీ స్టేషన్లో పచ్చ జెండా ఊపారు. మడ్గావ్ నుంచి ముంబై, ధార్వాడ నుంచి బెంగుళూరు, హతియా నుంచి పాట్నా వెళ్లే ఇక మిగితా మూడు వందేభారత్ రైళ్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైళ్ల ద్వారా మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుందని ప్రధాని తన ట్వీట్లో తెలిపారు.