Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఉగ్రవాదుల మరో ఘాతుకం.. కుల్గామ్‌లో బ్యాంకు మేనేజర్‌ హత్య

జమ్మూకశ్మీరులో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న ఘటనలు రోజూ చోటుచేసుకుంటున్నాయి. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లను ముమ్మరం చేసిన సైన్యం.. ముష్కరుల కోసం వేటాడుతోంది. అయినా సరే ఎక్కడో ఓ చోట సామాన్యులపై దాడి చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గత రెండు నెలలుగా కశ్మీరీ పండిట్లే ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇటీవల కాలంలో సాధారణ పౌరుల్ని ముఖ్యంగా లోయలోని హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు.. తాజాగా, ఓ బ్యాంకు మేనేజర్‌ను కాల్చి చంపారు. కుల్గామ్‌లోని ఇలాఖీ దేహితీ బ్యాంకు మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ను దారుణంగా హత్య చేశారు. మూడు రోజుల వ్యవధిలో లోయలో జరిగిన రెండో హత్య ఇది. కుల్గామ్‌లోని అరేప్‌ా ఇలాఖీ దేహితీ బ్యాంకులోకి గురువారం ఉదయం చొరబడిన ముష్కరులు.. విజయ్‌ కుమార్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రగాయాలతో ఉన్న బ్యాంకు మేనేజర్‌ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ విజయ్‌ కుమార్‌ చనిపోయారు. ఉగ్రవాదుల ఘాతకం మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. రాజస్థాన్‌లో హనుమాన్‌గఢ్‌కు చెందిన విజయ్‌ కుమార్‌.. ఈ ఉదయం బ్యాంకు విధులకు హాజరుకాగానే ముష్కరులు లోపలికి చొరబడి కాల్పుల జరిపారు. విజయ్‌ కుమార్‌కు ఇటీవలే కుల్గామ్‌ బ్రాంచ్‌లో చేరినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ముష్కరుల కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల కిందట కుల్గామ్‌లోనే కశ్మీరీ పండిట్‌, ఉపాధ్యాయురాలు రజినీ బాలాను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. అటు, షోపియాన్‌ జిల్లాలో బుధవారం రాత్రి ఫరూక్‌ అహ్మద్‌ షేక్‌ అనే వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. గురువారం ఉదయం సైనిక వాహనంలో పేలుడు సంభవించి ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిలో ఒక జవానుకి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ కోసం ప్రయివేట్‌ వాహనంలో సైనికులు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు ఐఈడీ, గ్రనేడ్‌ లేదా కారు బ్యాటరీ అనేది తేలియాల్సి ఉంది. అయితే, ప్రమాద తీవ్రతను బట్టి బ్యాటరీ పేలినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, బ్యాంకు మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ హత్యను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తీవ్రంగా ఖండిరచారు. అలాగే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడంలో కేంద్రం పూర్తి విఫలమయ్యిందని ధ్వజమెత్తారు. పౌరులకు సరైన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులను కచ్చితంగా పట్టుకుంటామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img