. లబ్ధిదారులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
. ఇళ్ల నిర్వహణ బాగుండాలని సీఎం జగన్ ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వచ్చే డిసెంబర్ కల్లా లక్షా 10 వేల 672 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2023 మార్చి కల్లా మరో లక్షా 10 వేల 968 ఇళ్లు అప్పగించే ఏర్పాట్లు చేయనుంది. ఈమేరకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో గృహ నిర్మాణాలపై సమీక్ష నిర్వ హించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్లు నిర్వహణ బాగుండాలని, వాటిని పట్టించుకోకుంటే మురికివాడలుగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణంపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా గృహనిర్మాణ పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.5,005 కోట్లు ఖర్చు చేశామని, విశాఖలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలపైనా ప్రత్యేక దృష్టిపెడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా కాలనీల్లో మౌలిక సదుపాయాలు, విద్యుద్దీకరణ పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే 40,576 టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించాం… డిసెంబర్ కల్లా 1,10,672 ఇళ్లు, మార్చికల్లా మరో 1,10,968 ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు.
ఫేజ్-1కు సంబంధించి దాదాపుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సీఎం ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, వేయి ఇళ్లకు పైగా ఉన్న చోట్ల నివాసితుల సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. ఇళ్ల నిర్వహణ, పారిశుధ్యం, వీధి లైట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ తదితర అంశాలపై సంఘాలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ… వర్షాలు తగ్గుముఖం పట్టినందున పేదలకోసం నిర్మించే పక్కా గృహాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ్డ ఆదేశించారు.టిడ్కో ఇళ్ల నిర్వహణ బాగుండాలని, వాటిని పట్టించుకోకపోతే మళ్లీ మురికి వాడలుగా మారే ప్రమాదం ఉంటుందన్నారు. ఏ రకంగా ఆ ఇళ్లను నిర్వహించుకోవాలన్నదానిపై సంఘాలకు బాసటగా నిలవాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్హెచ్సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ.ఎండీ. ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ లక్ష్మీషా, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.