Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తాడేపల్లిలో గంజాయి మత్తులో ఘాతుకం.. యువతిని నరికి చంపిన యువకుడు

గుంటూరు జిల్లాలో తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి మత్తులో యువతిని అతి కిరాతకంగా నరికి చంపాడు ఓ యువకుడు. యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసానికి కూత వేటు దూరంలో జరిగిన ఈ అమానుష ఘటన స్ధానికంగా సంచలనంగా మారింది.అసలు వివరాల్లోకి వెళ్తే.. కంటిచూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో రాజు అనే యువకుడు గంజాయి మత్తులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. అసభ్యకరంగా ప్రవర్తించడంతో.. రాజు ప్రవర్తనపై అమ్మ, పెద్దమ్మకి యువతి తెలియజేసింది. రాజుని తల్లి నిలదీయగా.. తనకేం పాపం తెలియదని, రాణి తనకు చెల్లి లాంటిని రాజు నమ్మబలికాడు. ఇది చెప్పిన ఐదు నిమిషాల్లోనే గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి రాణిని అతి దారుణంగా తలపై అనేకమార్లు నరికాడు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాణిని హుటాహుటిన ఆసుపత్రి తరలించేలోపు ప్రాణం కోల్పోయింది. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజుని అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు స్పష్టం చేశారు. చూపులేని తన కూతురిని అతి దారుణంగా నరికి చంపిన రాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే రాజు గతంలో అనేక నేరాలకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావుతో పాటు తన ఇంటి సమీపంలో వివాహిత మీద గొడ్డలితో దాడి చేశాడని అంటున్నారు. పోలీసులతో ఉన్న స్నేహాల వల్ల ఇలాంటి దారుణాలకు రాజు తెగబడుతున్నాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసుని కొట్టినప్పుడే రాజుపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు యువతిపై ఇలాంటి ఘాతుకానికి పాల్పడే వాడు కాదని స్థానికులు చెబుతున్నారు.

రాజు వల్ల ఎప్పటికైనా తమకే ప్రమాదమేనని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఎదురుగా నివసిస్తున్న ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా రాజుపై చట్టపరంగా తీసుకుని జైలుశిక్ష పడేలా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గంజాయి మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారని, చాలామంది యువకులు స్థానికంగా గంజాయి సేవిస్తున్నారని చెబుతున్నారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img