Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రూ.139 కోట్ల డోరాండా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్‌ దోషి

18న శిక్ష ఖరారు
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వెల్లడి

రాంచీ : దాణా కుంభకోణానికి సంబంధించిన ఐదో కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. రూ.139 కోట్ల డోరాండా ట్రెజరీ అక్రమార్జన కేసులో నిందితుడిగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ) అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది. ఫిబ్రవరి 18న శిక్ష ఖరారు చేయనున్నట్లు సీబీఐ న్యాయవాది తెలిపారు. న్యాయస్థానం ఈ కేసులో జనవరి 29న వాదనలను పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌ చేసింది. గతంలో దాణా కుంభకోణానికి సంబంధించిన ఇతర నాలుగు కేసుల్లో లాలూ ప్రసాద్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష పడిరది. ‘లాలూ ప్రసాద్‌ను దోషిగా తేల్చింది. ఫిబ్రవరి 18న శిక్షను ఖరారు చేయనున్నది’ అని సీబీఐ న్యాయవాది తెలిపారు. ప్రసాద్‌తో సహా 99 మంది నిందితులపై గత ఏడాది ఫిబ్రవరి నుంచి జరుగుతున్న విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌.కె.శశి కోర్టు పూర్తి చేసింది. చివరి నిందితుడు శైలేంద్ర కుమార్‌ తరఫున వాదనలు జనవరి 29న పూర్తయ్యాయి. తీర్పు వెలువడే రోజున నిందితులందరూ భౌతికంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో అసలు 170 మంది నిందితుల్లో 55 మంది మరణించారు. ఏడుగురు ప్రభుత్వ సాక్షులుగా మారారు. ఇద్దరు తమపై వచ్చిన అభియోగాలను అంగీకరించారు. ఆరుగురు పరారీలో ఉన్నారు. లాలూతోపాటు మాజీ ఎంపీ జగదీష్‌ శర్మ, అప్పటి పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్‌ ధ్రువ్‌ భగత్‌, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి బెక్‌ జూలియస్‌, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు కె.ఎం.ప్రసాద్‌ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ రూ.950 కోట్ల కుంభకోణం అవిభక్త బీహార్‌లోని వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ ఖజానాల నుండి ప్రజా నిధులను మోసపూరితంగా ఉపసంహరించుకున్నందుకు సంబంధించినది. కాగా అబే చైబాసా ట్రెజరీ నుంచి రూ.37.7 కోట్లను ఉపసంహరించుకున్న మొదటి కేసులో లాలూ ప్రసాద్‌కు 5 సంవత్సరాల శిక్ష పడిరది. దేవఘర్‌ ట్రెజరీ నుంచి నిధుల ఉపసంహరణ కేసులో మూడున్నరేళ్లు శిక్ష, చైబాసా ట్రెజరీ నుండి రూ.33.13 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్న మూడవ కేసులో 5 సంవత్సరాల శిక్ష పడిరది. దుమ్కా ట్రెజరీ నుండి రూ.3.76 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్లలో 7 – 7 ఏళ్ల జైలు శిక్ష పడిరది. లాలూ ఈ నాలుగు కేసులను గతంలో సవాలు చేశారు. ఐదో కేసును కూడా సవాలు చేసే అవకాశం ఉంది. దుమ్కా కేసులో హైకోర్టు నుంచి బెయిల్‌ పొందిన లాలూ ప్రస్తుతం జైలు నుంచి బయట ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img