Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నిమిషానికి 11 ఆకలి చావులు

కరోనా, పర్యావరణ సంక్షోభం, అంతర్గత యుద్ధాల వల్లే…
గతేడాదితో పోలిస్తే 20 మిలియన్లు ఎక్కువే
ఆహార సంక్షోభంలో 155 మిలియన్ల మంది
ఆక్స్‌ఫామ్‌ సంస్థ నివేదిక వెల్లడి

కైరో :
ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే…మరోవైపు ఎన్నో ప్రాంతాల్లో ఆకలి కరాళనృత్యం చేస్తూ వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీస్తోంది. కరోనా వ్యాప్తి, పర్యావరణ సంక్షోభం.. దీనికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్ధాలతో ఆకలి చావులు రోజు రోజుకీ పెరుగు తున్నాయి. పేదరిక నిర్మూలన కోసం పని చేస్తోన్న ‘ఆక్స్‌ఫామ్‌’ సంస్థ అందించిన నివే దిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషా నికి 11 మంది ఆకలితో మరణిస్తున్నారు. పెరుగుతున్న పేదరికం, ఆకలి చావులపై ఈ సంస్థ ‘ది హంగర్‌ వైరస్‌ మల్టిప్లైస్‌’ పేరుతో నివేదిక రూపొందించింది. ప్రస్తుతం 155 మిలియన్ల మంది అత్యంత దారుణమైన ఆహార సంక్షోభ పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 20 మిలియన్లు ఎక్కువ కావడం కలవరపరుస్తోంది. ఇక ఇందులో రెండొంతుల మంది తమ దేశాల్లో నెలకొన్న అంతర్గత సైనిక ఘర్షణల కారణంగా ఆకలితో అలమటిస్తున్నారని నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి కంటే కరువు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉన్నాయని, కొవిడ్‌ కారణంగా ప్రతి నిమిషానికి ఏడుగురు మరణిస్తుంటే.. ఆకలి ప్రతి నిమిషానికి 11 మందిని పొట్టనబెట్టుకుంటోందని వివరించింది. ఇప్పటికే ప్రకృతి విపత్తులు, కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్రపంచమంతా కొట్టుమిట్టాడుతుంటే.. కొన్ని దేశాల్లో అంతర్గత యుద్ధాలు అక్కడి ప్రజలకు శాపంగా మారుతున్నాయని ఆక్స్‌ఫామ్‌ సీఈవో అబే మాక్సమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఖర్చు 51 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ఆహార కొరత, పేదరిక నిర్మూలనను ఆపేందుకు ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన మొత్తం కంటే ఇది కనీసం ఆరు రెట్లు ఎక్కువని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌, ఇథియోపియా, దక్షిణ సూడాన్‌, సిరియా, యెమెన్‌ తదితర దేశాల్లో ఆకలి చావులు ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక తెలిపింది. కొన్ని దేశాల్లో ఈ ఆకలి ఆయుధంగా మారుతోందని పేర్కొంది. ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ అంతర్గత యుద్ధాలు ఆపాలని, అప్పుడే ఆకలి చావులను అరికట్టగలమని ఆక్స్‌ఫామ్‌ అభ్యర్థిస్తోంది. ఇదిలా ఉండగా.. గ్లోబల్‌ వార్మింగ్‌, ఆర్థిక మాంద్య పరిస్థితుల కారణంగా దశాబ్ద కాలంలో ఆహార పదార్థాల ధరలు 40శాతం వరకు పెరిగాయి. ఇది కూడా అనేక మంది ఆకలి చావులకు ఓ కారణమవుతోందని నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img