Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మళ్లీ పెండింగే !

విభజన సమస్యలపై త్రిసభ్య కమిటీ తొలి భేటీ
ఏపీ కోర్టు కేసులే పరిష్కారానికి అడ్డంకి అంటూ తెలంగాణ వాదన
ఏపీకి జరిగిన అన్యాయాన్ని బలంగా వినిపించిన అధికారులు
పౌరసరఫరాల శాఖకు సంబంధించిన అంశంపై ఏకాభిప్రాయం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ నియమించిన ఉప కమిటీ తొలి భేటీ ఆశించిన ఫలితాలనివ్వలేదు.
రెండు రాష్ట్రాల మధ్య ఏవైతే సమస్యలున్నాయో, వాటినే తిరిగి ప్రస్తావించడం మినహా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌ కుమార్‌ నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ త్రిసభ్య కమిటీ దృశ్య మాధ్యమం ద్వారా గురువారం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక సంస్థ-ఎస్‌ఎఫ్‌సీ విభజన, ఏపీ జెన్‌కోకు తెలంగాణ డిస్కంల నుంచి బకాయిలు, పన్నుల్లో వ్యత్యాసాల సవరణ, బ్యాంకు డిపాజిట్ల పంపిణీ, పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి. ఏపీకి విద్యుత్‌ బకాయిల అంశం పరిష్కరించేందుకు సిద్ధమని, అయితే కోర్టు కేసులను ఏపీ తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. విద్యుత్‌ శాఖకు సంబంధించి ఏపీ నుంచి తమకు 12,532 కోట్లు రావాల్సి ఉందని, అయితే పరిగణనలోకి తీసుకోకుండా తామే రూ.3,442 కోట్లు చెల్లించాలని ఏపీ అడుగుతోందని తెలంగాణ అధికారులు తమ వాదన వినిపించారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో అకస్మాత్తుగా పీపీఏలు రద్దు చేసి ఏపీ జెన్‌కో నుంచి విద్యుత్‌ నిలిపివేయడం, తక్కువ ధరతో వచ్చే సీలేరు జల విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ తీసుకోకుండా చేయడం వల్ల తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని వారు వివరించారు. పైగా తెలంగాణకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా, ఏపీ కోర్టును ఆశ్రయించిందని వారు తెలిపారు. విద్యుత్‌ బకాయిలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించుకుని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ఏపీ కోర్టు కేసు ఉపసంహరించుకోవాలని షరతు విధించింది. ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజనను ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టి, తమకు ప్రతిపాదనలు పంపిందని, కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా 235 ఎకరాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ప్రధాన కార్యాలయం కాని నానక్‌గూడాలోని కార్యాలయ భవనంలో వాటా అడగడం సమంజసం కాదన్నారు. వీటన్నింటి కారణంగా ఏపీఎస్‌ఎఫ్‌సీ విభజన పెండిరగ్‌లో పడిరదని, వీటిపై ఏపీ కోర్టు కేసులు ఉపసంహరించుకుంటేనే విభజన ప్రక్రియలో తదుపరి ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచారు. ఇక పన్నుల అంశానికి సంబంధించి ఏడున్నరేళ్ల తర్వాత విభజన చట్టం అవసరం లేదని తెలంగాణ మరోమారు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. సవరణలు చేస్తే అంతులేని వివాదాలొస్తాయని పేర్కొంది. సవరణ సాధ్యం కాకపోతే తమకు జరిగిన నష్టాన్ని కేంద్రం సరిచేయాలని ఏపీ ప్రభుత్వ అధికారులు ప్రతిపాదించారు. ఈ అంశంలో పన్నులకు సంబంధించి విభజన చట్ట సవరణ అవసరం లేదన్న తెలంగాణ వాదనతో అంగీకరించిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి, దానిని ద్వైపాక్షిక జాబితా నుంచి తొలగించేందుకు అంగీకరించారు. ఏపీ నుంచి నగదు బకాయిలు వెంటనే వచ్చేలా చూడాలని, రాజ్‌భవన్‌, హైకోర్టు నిర్వహణ బకాయిలు రూ.315 కోట్లు కూడా రాలేదని, కేంద్రప్రభుత్వ పథకాలకు సంబంధించిన రూ.495 కోట్లు ఏడేళ్లుగా ఏపీ నుంచి రావడం లేదని తెలంగాణ అధికారులు వివరించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకి సంబంధించిన రూ.464 కోట్లు, ఎస్‌సీసీఎఫ్‌కు చెందిన రూ.203 కోట్లు కూడా ఇవ్వాల్సి ఉందన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం నుంచి రావల్సిన నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల వివరాలు పంపాలని తెలంగాణ అధికారులకు సూచించారు. కేంద్ర నుంచి వచ్చిన రాయితీలో తెలంగాణ వాటా చెల్లించేలా ఏపీ అండర్‌ టేకింగ్‌ ఇస్తే తాము ఇవ్వాల్సిన రూ.354 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ తెలియజేయగా, దానికి ఏపీ అంగీకరించింది. ఇలా ఒకటి, రెండు అంశాలు మినహా ఎక్కువ సమస్యలపై ఈ సమావేశంలో స్పష్టత రాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img