ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత మళ్లీ వసూలు చేయాలని ఈఆర్సీ నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో అమరావతి : రాష్ట్రంలో విద్యుత్ ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెల్సింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ట్రూ అప్ చార్జీల పెంపుపై ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది ఆదేశాలు ఉంటాయని ఈఆర్సీ పేర్కొంది. ట్రూ అప్ చార్జీలు వసూలు చేసుకునేందుకు ఆగస్టు 27న ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. యూనిట్కు 40 పైసల నుంచి రూపాయి 23 పైసల వరకు ట్రూ అప్ చార్జీలను విద్యుత్ సంస్థలు వసూలు చేస్తున్నాయి. 2014
19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు అయిన అదనపు ఖర్చుల కింద సుమారు 4వేల కోట్లకు పైగా వసూలు లక్ష్యంతో గత రెండు నెలల నుంచి ట్రూ అప్ చార్జీలు వసూలు చేస్తున్నాయి. పత్రికా ప్రకటన ఇవ్వకుండా, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోకుండా ట్రూ అప్ చార్జీల వసూలుపై వినియోగదారులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విపక్షాలు ఆందోళనలు నిర్వహించారు. కాగా దసరా సెలవులు అనంతరం దీనిపై విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.