అమిత్షా చెబుతారంటున్న బొమ్మై
బెంగళూరు: రాష్ట్ర కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణకు సంబంధించి బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా తనకు చెబుతారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారం చెప్పారు. అమిత్షా మంగళవారం బెంగళూరులో ఉన్నారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బొమ్మై అధికారిక నివాసంలో విందుకు హాజరయ్యారు. బొమ్మై సహా రాష్ట్రంలోని కీలకనేతలతో అమిత్షా రహస్య మంతనాలు జరిపారు. కేబినెట్ విస్తరణపై అమిత్షా ఏమి చెప్పారని విలేకరులు ప్రశ్నించగా ‘దిల్లీ వెళ్లిన తర్వాత నేను మీతో మాట్లాడతాను’ అని ఆయన తనకు చెప్పారని బొమ్మై తెలిపారు.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై వస్తున్న ఊహాగానాలు, ఉపముఖ్యమంత్రుల నియామకాలపై అడుగగా ‘ఇది మీచు చెబితేనే నేను వింటున్నాను’ అని బొమ్మై వ్యాఖ్యానించారు. 2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు, కేబినెట్ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై ప్రచారం జరుగుతున్న వేళ అమిత్షా బెంగళూరు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. బొమ్మైను మారుస్తారన్న వార్తలను బీజేపీ సీనియర్ నేతలు చాలామంది తోసిపుచ్చారు. అభివృద్ధి, ఎన్నికల సన్నద్ధతపై దృష్టి కేంద్రీకరించాల్సిందిగా బొమ్మైకు అమిత్షా సూచించినట్లు కొంతమంది నేతలు అంటున్నారు. మిగిలినవన్నీ పార్టీకి వదిలేయాలని ఆదేశించారన్నారు.