. బడ్జెట్ సమావేశాల మధ్య ప్రయాణంపై సస్పెన్స్
. అకస్మాత్ నిర్ణయంపై అనుమానాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా హస్తినకు పయనమవ్వడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీ బడ్జెట్ను గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈనెల 24వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. కీలక బిల్లులు, ముఖ్యమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉంది. దీంతో సెలవు దినాలైన శని, ఆదివారాలు కూడా అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. కీలకమైన సమయంలో సీఎం జగన్ గురువారం సాయంత్రం అకస్మాత్గా దిల్లీకి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారపార్టీ వర్గాలు చెపుతున్నాయి. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ కేసులో మరికొందరు కీలకనేతలు అరెస్టయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క కోడికత్తి కేసులో ఏప్రిల్ 10వ తేదీ విచారణకు హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డికి ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎంతో పాటు పీఏ నాగేశ్వరరెడ్డి హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మోదీ, అమిత్షా అపాయింట్మెంట్ కోసం కొద్దిరోజులుగా ఎదురు చూస్తున్న జగన్ అకస్మాత్తుగా దిల్లీ వెళ్లడంపై పార్టీ నేతల్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది.