అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ డీ కిర్చినర్పై హత్యాయత్నం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. బ్యూనోస్ ఏరిస్లోని ఆమె నివాసం వద్ద ఓ ఆగంతకుడు తన వద్ద ఉన్న పిస్తోల్తో ఆమెను కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే ట్రిగ్గర్ నొక్కినా.. ఆ గన్ పేలలేదు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను వెంటనే రక్షించారు. ఈ ఘటనతో అర్జెంటీనా రాజకీయాల్లో మళ్లీ వేడి పుట్టింది. ట్రిగ్గర్ నొక్కినా.. గన్ పేలలేదని, క్రిస్టినా ప్రాణాలతోనే ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండేజ్ తెలిపారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. గన్లో అయిదు బుల్లెట్లు లోడై ఉన్నట్లు చెప్పారు. క్రిస్టినా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమెపై విచారణ సాగుతోంది. అటాక్ జరిగిన సమయంలో ఆమె ఇంటి వద్ద వేలాది మంది మద్దతుదారులు కూడా ఉన్నారు. ఆగంతకుడు కేవలం కొన్ని ఇంచుల దూరం నుంచే పిస్తోల్ను పేల్చినట్లు వీడియో ఫూటేజ్ ద్వారా తెలుస్తోంది. కాల్పులకు దిగిన వ్యక్తిని 35 ఏళ్ల బ్రెజిల్ వ్యక్తిగా గుర్తించారు. అతన్ని వెంటనే అరెస్టు చేశారు. గన్ను సీజ్ చేశారు. వచ్చే జనరల్ ఎన్నికల్లో క్రిస్టినా దేశాధ్యక్షురాలిగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.