ఐరాస : గ్లాస్గోలో జరుగనున్న కాప్ 26 వా తావరణ మార్పు సదస్సు ప్రపంచానికి ‘ఒక మలుపు’ వంటిదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం పేర్కొన్నారు. న్యూయార్క్లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ చర్యలకోసం ప్రతి సంవత్సరం 100 బిలియన్ డాలర్లను అందించే కార్యక్రమాన్ని గౌరవించాలని సంపన్న దేశాలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు తుపానులు, వరదలు, అగ్నిప్రమాదాలు, వరదలతోపాటు దీర్ఘకాలిక ఆర్థిక నష్టాలరూపంలో విపత్తులకు లోనవుతున్నారు. 200 సంవత్సరాలకుపైగా వాతావరణంలో కార్బన్ నిల్వలకు ప్రధాన కారణం అభివృద్ధి చెందిన దేశాలే…వాతావరణ మార్పులకు ప్రధాన కారణం అభివృద్థి చెందిన దేశాలే…కావున అభివృద్ధి చెందని దేశాలకు సహాయం చేయవలసిన బాధ్యత మనపై ఉందని జాన్సన్ స్పష్టం చేశారు. కాప్ 26కంటే సమావేశం ముందుగానే వార్షిక వాతావరణ సహాయం క్రింద 100 బిలియన్ డాలర్ల సహాయ కార్యక్రమం విఫలమైతే ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలకు చరిత్ర తగిన గుణపాఠం చెబుతుందని అన్నారు. నవంబరు కన్నా ముందుగానే ఈ సహాయం అందుతుందని జాన్సన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనావైరస్ వలెనే వాతావరణ కాలుష్యానికి మనుషులు బలికాకూడదనే తన ప్రధాన సంకల్పమని అన్నారు. రానున్న తరాల కోసం, భూగ్రహాన్ని పరిరక్షించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. బ్రిటన్ను ప్రపంచ హరిత పారిశ్రామిక విప్లవానికి ప్రయోగ వేదికగా మలుస్తానని పేర్కొన్నారు.
2030 నాటికి కర్బన ఉద్గారాలను 45శాతం తగ్గించాలి: గుటెర్రస్
యునైటెడ్ నేషన్:్స : అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ చర్యల కోసం సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను అందించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రస్ ధనిక దేశాలకు పిలుపునిచ్చారు. ఉష్ణోగ్రతలను 1.5డిగ్రీలకు పరిమితం చేయాలని 2030 నాటికి కర్బన ఉద్గారాలు 45శాతం క్షీణిస్తే తప్ప కార్బన్ తటస్థీకరణను చేరుకోలేమన్నారు. 2010 స్థాయిలతో పోలిస్తే 2030లో కర్బన ఉద్గారాలలో 16శాతం పెరిగిందని గుటెర్రస్ హెచ్చరించారు. అక్టోబరు 31 నుండి నవంబరు 12 వరకు బ్రిటన్లో గ్లాస్గోలో జరుగనున్న కాప్26 వాతావరణ మార్పు సదస్సుజరుగుతుంది.