విశాలాంధ్ర – ఆదోని : కర్నూలు జిల్లాలో విద్యనభ్యసిస్తున్న కరువు ప్రాంతాల విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల ఫీజులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు గౌడ్,జిల్లా సహాయ కార్యదర్శి షాభిర్ బాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆదోని ఏఐవైఎఫ్ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో అధిక వర్షాలు ఎక్కువై సరైన కాలంలో పంటలు చేతికి రాక రైతులు అనేక అవస్థలు పడుతున్నారని,పొలంలో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని,విద్యార్థులు కళాశాలలో చదివేందుకు ఫీజులు కట్టాలని తల్లిదండ్రులను అడిగితే వేసిన పంటలు ఎండిపోయి చేతికి రాలేదని ఇంకా మీకెక్కడ ఫీజులు కడతామని అవసరమైతే కాలేజీ చదువులు మానుకొని ఎక్కడికైనా వలసలు పోదామని విద్యార్థులను తల్లిదండ్రులు వలసలకు తీసుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక వర్షాల వల్ల పంటలు మొత్తం నీళ్లలో మునిగిపోయి, కొంతమంది రైతులు పోలాల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లా లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని అన్నారు. పేరుకు మాత్రమే ఆదోని రెండవ ముంబాయి గా ప్రసిద్ధి చెందిందని, ప్రభుత్వ విద్యాసంస్థలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదని, ప్రజా ప్రతినిధుల హామీలు కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజా ప్రతినిదుల హామీలు అమలు దిశగా ముందుకు వెళ్లడం లేదని, వాటి సాధన కోసం ఈ నెల16 నుంచి 20వరకు జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని,ఈ పాదయాత్ర ఆదోని నుంచే ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు, దస్తగిరి, డివిజన్ నాయకులు శివ ప్రసాద్, మల్లికార్జున, వీరేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.