ప్రధాని, సీఎంకు కూనూరు ప్రజల విజ్ఞప్తి
ఉదకమండలం : హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఇతర సైనికులకు ఘటనాస్థలిలో స్మారకస్థూపం నిర్మించాలని తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ వెల్లింగ్టన్ కంటోన్మెంట్ ప్రజలు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో ఇటీవల హెలికాప్టర్ కూలి రావత్, ఆయన భార్య మధూలిక సహా 14మంది మరణించిన విషయం విదితమే. అమరుల స్మృత్యర్థం స్థూపం నిర్మించాలని కోరుతూ స్థానికులు సోమవారం ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, తమిళనాడు సీఎం స్టాలిన్లకు లేఖ రాశారు. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రజలు తీవ్రంగా కలత చెందారు. ఆ ప్రాంతం కూనూరు సమీపంలోని నంజప్పసత్తిరామ్ సమీపంలో ఉంది. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు స్మారకస్థూపం అవసరమని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు సైతం అమరులకు నివాళి అర్పించడానికి వీలుంటుందని తెలిపారు.