కొచ్చి : ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా కార్మికసంఘాలు సోమవారం కేరళలో ఆందోళనలు నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలపై నిప్పులు చెరిగాయి. ఆందోళనలతో రాష్ట్రంలోని అనేక ప్రధాన రహదారులపై రవాణా స్తంభించింది. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ, యూటీయూసీ, ఎస్టీయూ, హెచ్ఎంఎస్ సహా 21 కార్మిక సంఘాలు ఆందోళనల్లో పాల్గొన్నాయి. కార్మిక నాయకులు, కార్యకర్తలు ఎక్కడి వాహనాలను అక్కడ నిలిపివేశారు. పెట్రోలు, డీజిలు ధరల పెరుగుదలకు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొచ్చి వంటి రద్దీగా ఉండే నగరాల్లోని అనేక జంక్షన్లలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదనపు ఎక్సైజ్ సుంకం, సెస్ను నిలిపివేయాలని కార్మికనేతలు కేంద్రాన్ని డిమాండు చేశారు. మోదీ సర్కారు పెట్రోలు, డీజిలుపై అనేక రెట్లు ఎక్సైజ్ సుంకం పెంచిందని, ఫలితంగా ఇంధన ధరలు పెరిగాయని కార్మిక నాయకులు విమర్శించారు.