నాణ్యతతో నిమిత్తం లేకుండా ప్రతి జ్యువెల్లరీ వ్యాపారి జూన్ ఒకటో తేదీ నుంచి హాల్మార్క్డ్ బంగారం ఆభరణాలు విక్రయించాల్సి ఉంటుంది. క్యారట్లతో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభరణాలు తప్పనిసరిగా హాల్మార్క్డ్ చేసి విక్రయించాల్సిందే. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) గత నెల నాలుగో తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. 14 క్యారట్లు, 18 క్యారట్లు, 20 క్యారట్లు, 23 క్యారట్లు, 24 క్యారట్ల బంగారంపై హాల్మార్కింగ్ వాడుతున్నారు. 21 క్యారట్లు లేదా 19 క్యారట్ల బంగారం ఆభరణాలకు ఇప్పటి వరకు హాల్మార్కింగ్ లేదు. కానీ, జూన్ ఒకటో తేదీ నుంచి నిబంధనలు మారిపోతున్నాయి. జూన్ ఒకటో తేదీ నుంచి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్) హాల్ మార్కింగ్ లేకుండా బులియన్ వ్యాపారులు ఏ బంగారం ఆభరణాన్ని విక్రయించరాదు. ఏ వ్యక్తైన 12 క్యారట్లు లేదా 16 క్యారట్ల బంగారం ఆభరణం కొనాలనుకున్నా.. జ్యువెల్లరీ షాప్ యజమాని తొలుత బీఐఎస్ హాల్మార్కింగ్ సెంటర్ నుంచి హాల్మార్కింగ్ చేసిన తర్వాతే విక్రయించాల్సి ఉంటుందని పీఎస్ఎల్ అడ్వొకేట్స్ అండ్ సొలిసిటర్స్ మేనేజింగ్ పార్టనర్ సమీర్ జైన్ తెలిపారు.