చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన సరుకులు లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేయబడతాయని, ఇకపై క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు ఐచ్ఛికం అని మాన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ పథకం వివరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని స్పష్టం చేశారు. ‘మా అధికారులు లబ్ధిదారులకు ఫోన్ కాల్ చేస్తారు. వారి సౌలభ్యం, అందుబాటులో ఉండటాన్ని బట్టి వారి ఇళ్లకు రేషన్ పంపిణీ చేయబడుతుంది’ అని మాన్ పేర్కొన్నారు. ఈ పథకం ఐచ్ఛికమని, రేషన్ డిపో మీ ఇంటికి చాలా దగ్గరలో ఉంటే అక్కడి నుంచే రేషన్ తెచ్చుకోవచ్చునని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు. ‘అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం దిల్లీలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ దురదృష్టవశాత్తు అది ఆగిపోయింది. కానీ పంజాబ్లో మేము ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయబోతున్నాము’ అని మాన్ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పేదలు, సామాన్యులు తమ రేషన్ కోసం రేషన్ డిపోల వెలుపల పెద్ద పెద్ద క్యూలలో నిలబడాల్సి రావడం బాధాకరమని మాన్ పేర్కొన్నారు.