బెంగళూరు: కర్ణాటకలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలిరోజు సోమవారం వేల కోట్ల విలువైన రైలు, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత ఆయన ఇక్కడి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ప్రాంగణంలో రూ.280 కోట్లతో ఏర్పాటు చేసిన బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (సీబీఆర్)ని ప్రారంభించారు. అనంతరం 832 పడకల బాగ్చీ-పార్థసారథి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీబీఆర్ను ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రతి దేశం ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన తరుణంలో, బాగ్చి పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వంటి ప్రయత్నాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి’ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్.గోపాలకృష్ణన్, ఆయన కుటుంబసభ్యులు పాల్గొన్నారు. గోపాలకృష్ణన్, ఆయన భార్య సుధా గోపాలకృష్ణన్ భూరి విరాళంతో ఐఐఎస్సీలో సీబీఆర్ను అభివృద్ధి పర్చినట్లు అధికారులు తెలిపారు. ఇది స్వయంప్రతిపత్తితో కూడిన లాభాపేక్షలేని పరిశోధన సంస్థగా స్థాపించినట్లు పేర్కొన్నారు. మెదడు సంబంధిత రుగ్మతలను ఎలా నివారించాలన్నదానిపై పరిశోధనలో ఈ కేంద్రం ముందంజలో ఉంటుంది.