కాంగ్రెస్ వర్గాలకు రాహుల్ పిలుపు
న్యూదిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అవినీతిపై పోరును కొనసాగించాలని కాంగ్రెస్ వర్గాలకు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. 2016, సెప్టెంబరు 23న 36 రఫేల్ విమానాల కోసం జరిగిన ఒప్పందంపై బీజేపీ సర్కార్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తోందని విమర్శించారు. రఫేల్ ఒప్పందంపై తాజా వివాదం నేపథ్యంలో రాహుల్ మంగళవారం స్పందించారు. వాస్తవాలు ప్రతి అడుగులో మీ వెంటనే ఉంటాయన్న రాహుల్.. బీజేపీ ప్రభుత్వ అక్రమాలపై పోరునకు వెనుకడుగు వేయొద్దు .. భయపడొద్దని పార్టీ సహచరులకు సూచించారు. ‘ఆగొద్దు, అలసిపోవద్దు, భయపడొద్దు’ అంటూ రఫేల్ కుంభకోణం హ్యాష్ట్యాగ్తో హిందీలో ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు.మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్పాత్రా కాంగ్రెస్ నాయకత్వంపై రాహుల్పై విమర్శలు చేశారు. యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఐఎన్సీని ‘ఐ నీడ్ కమిషన్’ (నాకు కమిషన్ కావాలి)గా అభివర్ణించారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా అందరూ కమిషన్ కావాలంటారు. ప్రతి ఒప్పందంలోనూ యూపీఏ ప్రభుత్వానికి ఒప్పందం ఉందని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతానికి భారత్లో లేని కాంగ్రెస్ నేత ఇటలీ నుంచే తాజా వివాదంపై స్పందించాలని విలేకరుల సమావేశంలో ఆయన సవాల్ విసిరారు. యూపీఏ ప్రభుత్వం రూ.526 కోట్లకు ఖరారు చేసుకున్న రఫేల్ ఒప్పందాన్ని మార్చి ప్రతి విమానాన్ని రూ.1,670 కోట్లకుపైగా విలువకు మోదీ ప్రభుత్వం కొనుగోలు చేసిదంటూ కాంగ్రెస్ ‘అవినీతి’ ఆరోపణలు చేయడం తెలిసిందే.