న్యూదిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మళ్లీ ఎయిమ్స్లో చేరారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో హడావుడిగా ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. మంగళవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) వైద్యులు తక్షణమే దిల్లీ తరలించాలన్న సిఫార్సు మేరకు లాలూను రాత్రి 9 గంటల సమయంలో నిమ్స్లో చేరారు. ‘లాలూను 24 గంటలు పరిశీలించే నిమిత్తం అత్యవసర వార్డులో ఉంచాం. కోలుకున్న ఆయనను తెల్లవారుజామున 3 గంటలకు డిశ్చార్జ్ చేశాం’ అని బుధవారం ఉదయం ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ‘లాలూ క్రియాటిన్ స్థాయి 4.6కు చేరుకుంది. అంతకుముందు 3.5గా ఉంది, అలాగే సుగర్, బీపీలో కూడా హెచ్చుతగ్గులున్నాయి’ అని డా॥ విద్యాపతి తెలిపారు. కిడ్నీల పనితీరు కూడా 15`20 శాతం మాత్రమే ఉందని ఆయన వివరించారు.