ఈ ఏడాది కాస్త ముందే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు నిదానంగా ముందుకు కదులుతున్నాయి. తాజాగా నైరుతి రుతుపవనాలు ముంబయిని పలకరించాయి. గత రాత్రి ముంబైలో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నైరుతికి స్వాగతం పలికింది. ముంబై నైరుతి ప్రభావం మొదలైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) నేడు అధికారికంగా ప్రకటించింది. కాగా, గత 24 గంటల వ్యవధిలో ముంబయిలో 61.8 మిమీ వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏడాది ముంబైలో నైరుతి రుతుపవనాలు కుంభవృష్టికి కారణమవుతుంటాయి. ఈ ఏడాది సాధారణం కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందన్న ఐఎండీ అంచనాల నేపథ్యంలో, బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది.