2024 ఎన్నికల ఫలితాలను ఈ 2022 ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి నష్టదాయకమే అవుతుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భారీ విజయం సాధించడం పట్ల కూడా మమతా బెనర్జీ స్పందించారు. యూపీలో ఈవీఎం అక్రమాలు ముమ్మరంగా జరిగాయని ఆరోపించారు. ఈ ఫలితాలతో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మనోస్థైర్యం కోల్పోరాదని అన్నారు. అఖిలేశ్ యాదవ్ కు ఈసారి ఓటింగ్ పెరిగిందని, 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని వివరించారు. ఈవీఎం యంత్రాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపేలా అఖిలేశ్ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ కోరుకుంటే, ఇప్పుడు తీవ్రంగా స్పందించడం మానుకోవాలని సలహా ఇచ్చారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.