న్యూదిల్లీ :‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించనున్నామని, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అనేకమంది ఇతర ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని లోక్సభ సెక్రటేరియట్, స్పీకర్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకలను 2015లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లు గురించి అడిగిన ప్రశ్నపై జోషి స్పందిస్తూ.. ప్రధాని ఇప్పటికే ప్రకటన చేశారని, వ్యవసాయ మంత్రిత్వ శాఖ దీనిపై చర్చిస్తోందని చెప్పారు.