న్యూదిల్లీ : నేటి అనిశ్చితి వాతావరణంలో ఎటువంటి ఎలాంటి వివాదాలు తలెత్తే అవకాశాలను తోసిపుచ్చలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం అన్నారు. ఎలాంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారతదేశ సంసిద్ధతను పెంచే ప్రయత్నాల్లో భాగంగా సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. సరిహద్దు రహదారి సంస్థ(బీఆర్వో) ద్వారా అమలయిన 27 రోడ్లు, వంతెనల ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత రాజ్నాథ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోయినట్లయితే, ఉత్తరాది సెక్టార్లో ప్రత్యర్థికి భారత్ దీటుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉండేది కాదని తెలిపారు. దక్షిణ లడఖ్లోని ఉమ్లింగ్`లా పాస్పై 19 వేల అడుగులకు మించి ఎక్కువ ఎత్తులో నిర్మించిన ఒక దానితో సహా 24 రహదారులను ఒక వర్చువల్ కార్యక్రమం ద్వారా సింగ్ ప్రారంభించారు. ఇది ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తయిన మోటారు రహదారి అని తెలిపారు. ‘నేటి అనిశ్చిత వాతావరణంలో ఏ విధమైన సంఘర్షణ అవకాశాన్ని తోసిపుచ్చలేము. ఇలాంటి పరిస్థితులు ఈ ప్రాంతాల అభివృద్ధికి మరింత ప్రేరణనిస్తాయి. ఈ ప్రాంతాల అభివృద్ధిలో సహకారం కోసం బీఆర్వో మాకు ఉండటం గర్వించదగిన విషయం’ అని రాజ్నాథ్ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై తగిన శద్ధ్ర చూపలేదని, అయితే గత కొన్నేళ్లుగా ఈ విషయంలో పెను మార్పు వచ్చిందని రక్షణ మంత్రి తెలిపారు. ‘ఈ విధంగా వంతెనలు, రహదారులు, సొరంగ మార్గాలు మన భద్రత, మొత్తం దేశాన్ని శక్తిమంతం చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి’ అని అన్నారు. ఇది బీఆర్వోకే కాదు, దేశానికి గర్వకారణం అని తెలిపారు.