బౌద్ధ తీర్థయాత్రకు ఊతం : మోదీ
కుషీనగర్: ఉత్తరప్రదేశ్లోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయమైన కుషీనగర్ ఎయిర్పోర్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీలంక నుంచి 120 మంది బౌద్ధ సాధువులు, ప్రముఖులతో కూడిన తొలి విమానం ఈ ఎయిర్పోర్టుకు బుధవారం చేరుకోనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘దశాబ్దాల ఆశలు, కలలకు ఫలితమే కుషీనగర్ ఎయిర్పోర్టు. ఈ రోజు నా ఆనందం రెట్టింపైంది. ఎంతో సంతృప్తిగా ఉంది. ఇది కేవలం విమానయాన సదుపాయం మాత్రమే కాదు. దీని వల్ల పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. దీనివల్ల ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత వృద్ధి చెందుతుంది’’ అని తెలిపారు. కుషీనగర్ బౌద్ధులకు అత్యంత ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి. గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందినది ఇక్కడే. అందుకే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సాధువులు ఏటా ఇక్కడకు వస్తుంటారు. వీరికి సౌలభ్యం కల్పించడంతో పాటు బౌద్ధ తీర్థయాత్రను మరింత ప్రోత్సహించే విధంగా కుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు రూ.260కోట్లతో దీన్ని నిర్మించారు.