ఎమ్మెల్యే లూరెంకో రాజీనామా
పనాజీ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గోవాలో కాంగ్రెస్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలెక్సో రెజినాల్డో లూరెంకో సోమవారం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో 40 మంది సభ్యులు గల అసెంబ్లీలో కాంగ్రెస్ బలం రెండుకి పడిపోయింది. ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. లూరెంకో రాజీనామాపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ప్రజలకు నమ్మకద్రోహం చేసిన నాయకులు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. లూరెంకో నియోజకవర్గ ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 8 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను గతవారం ప్రకటించింది. ఆ జాబితాలో లూరెంకో పేరు కూడా ఉంది. లూరెంకో తన రాజీనామా లేఖను స్పీకర్ కార్యాలయానికి సమర్పించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామాపై స్పందించడానికి లూరెంకో అందుబాటులో లేరు. ఆయన త్వరలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.