న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా పాఠశాలలు తెరవడం, ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది వాక్సిన్ అందించడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలలు తెరవడంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించామని, ఉపాధ్యాయుల, బోధనేతర సిబ్బందికి వాక్సిన్ అందించడంపై ప్రధానంగా దృష్టిపెట్టామని ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ ద్వారా తెలిపారు. కరోనా ప్రభావంతో గత ఏడాది మార్చి నుంచి పాఠశాలలు మూసివున్న విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబరులో పాఠశాలలు కొంత మేర తెరిచినా ఈ ఏడాది ఏప్రిల్లో రెండో వేవ్ కారణంగా మళ్లీ పాఠశాలలు మూతపడ్డాయి.