లక్నో : ఉత్తరప్రదేశ్, అలీఘర్లోని రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యూనివర్శిటీకి ప్రధాని మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త సామాజిక సంస్కర్త అయిన రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ జ్ఞాపకార్థం అలీఘడ్ దగ్గర్లోని లోధా, ముసేపూర్ కరీం జరౌలి గ్రామ పరిసరాల్లో 92 ఎకరాలవిస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని యోగీ ప్రభుత్వం భావించింది. ఈ వర్సిటీ అలీగఢ్ డివిజన్లోని 395 కాలేజీలకు అనుబంధాన్ని అందించనున్నట్టు అధికారులు తెలిపారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న దశలో జాట్ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునే రాజకీయ ఎత్తుగడలతో వర్సిటీని స్థాపించాలనే నిర్ణయం తీసుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం.
హిందీ దివస్ శుభాకాంక్షలు
‘హిందీ దివాస్’ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హిందీని సమర్థవంతమైన భాషగా రూపొందించడంతో వివిధ ప్రాంతాల ప్రజలు గణనీయమైన పాత్ర పోషించారని, తద్వారానే హిందీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని మంగళవారం ట్వీట్ చేశారు.