న్యూదిల్లీ: గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదకత అనే అంశాలపై నిత్యం సలహాలు, సూచనలిచ్చే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బుధవారం భారత్లోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ పవర్డ్ కారులో పార్లమెంటుకు వచ్చారు. దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై పెద్దఎత్తున చర్చ నడుస్తోన్న తరుణంలో ఆయన గ్రీన్ హైడ్రోజన్తో నడిచే కారులో ఇంటి నుంచి పార్లమెంటుకు చేరుకున్నారు. మార్చి ఆరంభంలో దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాన్ని గడ్కరీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మాట్లాడుతూ తాను హైడ్రోజన్ పవర్డ్ కారు టయోటా మిరాయ్ వాహనాన్ని ఉపయోగిస్తానని చెప్పారు. కారుకు గ్రీన్ హైడ్రోజన్ ఎలా శక్తినందిస్తుందో వివరించే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దేశాన్ని శక్తివంతంగా మార్చడానికి, పర్యావరణ అనుకూల ఇంధన మార్గం గ్రీన్ హైడ్రోజన్ అని తెలిపారు. జపాన్కు చెందిన టయోటా తనకు గ్రీన్ హైడ్రోజన్తో నడిచే వాహనాన్ని అందించిందని, దాన్నే తాను వినియోగిస్తున్నట్టు వివరించారు. భవిషత్తులో గ్రీన్ ఫ్యూయల్ టెక్నాలజీ పురోగతి సాధిస్తుందని, రానున్న రెండేళ్ల్లలో పెట్రోలు వాహనాలతో సమానంగా ఈ తరహా వాహనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గడ్కరీ ప్రయాణించిన కారును పూర్తిగా నింపితే కిలోమీటరుకు రెండు రూపాయల ఖర్చుతో 600 కిలోమీటర్లు వరకూ ప్రయాణించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే ఇంధన ట్యాంక్ను నింపుకోవచ్చు.