Friday, April 26, 2024
Friday, April 26, 2024

పనామాలోనూ ఎగరనున్న ఎర్రజెండా!

ఎం. కోటేశ్వరరావు
లాటిన్‌ అమెరికాలో పెరుగుతున్న వామపక్ష ప్రభావాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందంటూ తాజాగా ఒక ప్రొఫెసర్‌ హెచ్చరించాడు. రెండు వందల సంవత్సరాల్లో తొలిసారిగా అమెరికాకు సన్నిహితమైన కొలంబియాలో వామపక్ష నేత గుస్తావ్‌ పెట్రోను ఎన్నుకోవటంతో ప్రతిదీ మారుతోందంటూ గుండెలు బాదుకున్నాడు. 2010 దశకం నుంచి పెరుగుతున్న ఎర్ర మంటను ఆర్పలేకపోయినట్లు వాపోయాడు. రష్యా, చైనాలను అడ్డుకోవటం ఎలా అన్నదానిమీదే అమెరికా కేంద్రీకరిస్తోంది తప్ప లాటిన్‌ అమెరికాలో వాటి ప్రభావాన్ని అడ్డుకొనేందుకు చూడటం లేదన్నాడు. వెనెజులాను దెబ్బతీయటంలో కొలంబియా ప్రధాన పాత్రధారిగా ఉంది. ఇప్పుడు గుస్తావ్‌ పెట్రో వెనెజులాతో సంబంధాలను పునరుద్దరించుకుంటానని చెప్పటం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన అమెరికా దేశాల శిఖరాగ్ర సమావేశానికి వెనెజులా, క్యూబా, నికరాగువాలను ఆహ్వానించనందుకు నిరసనగా తాను ఆ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ప్రకటించటం అమెరికాకు చెంపదెబ్బ వంటిది. జో బైడెన్‌ శ్రద్దలేమి వలన దూరంగా ఉన్న చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌, అఫ్గానిస్తాన్‌, భారత్‌, తూర్పు ఐరోపాలనే కాదు, పెరటి తోటగా ఉన్న లాటిన్‌ అమెరికాను కూడా కోల్పోతున్నామంటూ మరో విశ్లేషకుడు వాపోయాడు. రెండు సంవత్సరాలు కూడా గడవక ముందే అమెరికా అనుకూల పెరూ, కొలంబియాలను బైడెన్‌ ఏలుబడిలో కోల్పోయాం. బ్రెజిల్‌ నుంచి పనామా, గౌతమాల నుంచి మెక్సికో వరకు ఎక్కడ చూసినా వామపక్ష శక్తులు ముందుకు పోతున్నాయి. జనాన్ని ఏమార్చేందుకు గత రెండు దశాబ్దాల్లో మనం ఖర్చు చేసిన బిలియన్ల డాలర్లు దేనికీ పనికి రాలేదు. మన పెరటితోటలోనే పలుకుబడి కోల్పోవ టాన్ని ప్రపంచంలోని మన స్నేహితులు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని చూస్తున్న చైనా చిరునవ్వులు చిందిస్తోంది, మన స్థానాన్ని ఆక్రమించేందుకు చూస్తోంది. గత పాతిక సంవత్సరాల్లో మన అధ్యక్షులతో భేటీ వేసిన వారందరూ ఒక్కొక్కరుగా జారిపోతుంటే గుండెలు బద్దలువుతున్నాయి. దీర్ఘకాలం మన అనుంగు దేశంగా ఉన్న కొలంబియా వామపక్ష శక్తుల వశమైందని కూడా బైడెన్‌ గ్రహించినట్లు లేదు. చైనా తమ ప్రాంతంలోనే కాదు చివరికి మన దగ్గర కూడా కమ్యూనిజాన్ని ముందుకు నెడుతోందని సదరు విశ్లేషకుడు గుండెలు బాదుకున్నాడు.
లాటిన్‌ అమెరికాలో జరుగుతున్న పరిణామాల గురించి కొందరు అమెరికా భక్తుల కడుపు మంట ఇది. వెనెజులాలో ఆగస్టు నెలలో జరిగే మిలిటరీ క్రీడలనే కాదు, పనామాలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కూడా పట్టించు కోకపోతే అది కూడా వామపక్షాల వశం కానుందని ఒక విశ్లేషకురాలు రాసిన దానికి వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌తో సహా అనేక పత్రికలు ప్రాధాన్యత ఇచ్చాయి. పశ్చిమార్ధ గోళంలో తొలిసారిగా రష్యా నిర్వహించే క్రీడలివి. లాటిన్‌ అమెరికాలో రష్యా, ఇరాన్‌, చైనా నిరంతరం కనిపిస్తూనే ఉంటాయని చెప్పటమే మిలిటరీ క్రీడల లక్ష్యమని మరింతగా చెప్పాలంటే ఈ ప్రాంతం వెలుపల అమెరికాను వ్యతిరేకించే మిలిటరీలను ఇక్కడి దేశాలు ఆహ్వానించే, సమ్మతికి బాట వేయటమేనని కూడా ఆమె పేర్కొన్నారు.
అసలు పనామాలో ఏం జరుగుతోంది ? పనామా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పనామా కాలువ. అట్లాంటిక్‌పసిఫిక్‌ సముద్రాలను కలిపే 81కిలోమీటర్ల పొడవైన కాలువ. పనామా జనాభా నలభై లక్షలు కాగా, సగం మంది రాజధాని పనామా సిటీలోనే ఉంటారు. ఉత్తరదక్షిణ అమెరికాలను అనుసంధానించే దేశం పనామా. జులై ఆరవ తేదీన శాంటియాగో డి వెరాగువాస్‌ అనే చిన్న పట్ణణంలో (ఇది పనామా కాలువ నుంచి ఇతర లాటిన్‌ అమెరికా దేశాలకు వస్తువులను రవాణా చేసే కీలక రహదారి ప్రాంతంలో ఉంది. దాన్ని మూసివేస్తే రవాణా మొత్తం ఆగిపోతుంది) ప్రభుత్వ విధానాలు, జనం మీద మోపు తున్న భారాలకు వ్యతిరేకంగా సమ్మె రూపంలో టీచర్ల సంఘం తొలుత నిరసన తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఈ నిరసన పాకింది. బలమైన నిర్మాణ సంఘ కార్మికులు కలిశారు. తరవాత రైతులు, విద్యార్థులు, మూలవాసులు అందరూ గళం విప్పారు. కార్మికుల సమ్మెతో విమానాలు ఎక్కాల్సిన వారు నడిచి పోవాల్సి వచ్చింది. శ్రీలంక పరిణామాలు గుర్తుకు వచ్చి లేదా తోటి దేశాల్లో పరిణామాలను చూసి కావచ్చు గాలన్‌ (3.78 లీటర్లు) పెట్రోలు ధరను ఆరు నుంచి 3.25 డాలర్లకు తగ్గించారు. పనామా టీచర్లు సమ్మె విరమించలేదు. ఇరవయ్యవ తేదీన పనామా కాథలిక్‌ బిషప్పును రంగంలోకి తెచ్చారు. ప్రభుత్వం`నిరసన తెలుపుతున్న సంఘాల ప్రతినిధులతో కూర్చోపెట్టారు. ఆహార, ఔషధాల ధరల అదుపు, విద్యపై ఖర్చు పెంపు, విద్యుత్‌ సబ్సిడీలు వంటి ఎనిమిది అంశాలపై ప్రజాసంఘాలు ఆమోదం తెలిపినట్లు బిషప్‌ ప్రకటించారు తప్ప ఆందోళనలు ఆగలేదు. పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వానికి అను కూలంగా మాట్లాడేందుకు ఎవరూ సిద్దం కాలేదు. ధరల పెరుగుదలే కాదు, రాజ కీయ అవినీతిపై చర్యలు, రాజకీయ సంస్కరణలు చేపట్టాలనే డిమాండ్లు కూడా ముందుకు వచ్చాయి. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ దర్శనమిచ్చినట్లుగా జనం తీవ్ర ఇక్కట్లపాలైన స్థితిలో పనామా పాలక పార్టీ ఎంపీలు ఖరీదైన విస్కీ తాగుతూ మజా చేస్తున్న వీడియోలు జనానికి ఆగ్రహం తెప్పించాయి. ఆశ్రితులను అందలాలెక్కించటం, సంస్కరణల పేరుతో కార్మికుల హక్కులను హరించటం, ఖరీదైన విదేశీ ఔషధాల దిగుమతులకు అనుమతులు వంటి వాటికి ఇచ్చిన ప్రాధాన్యత జన ఇబ్బందులకు ఇవ్వలేదు. ఔషధాల లేమి, వేతనాల కోత, చివరికి డాక్టర్లకు సైతం వేతనాల నిలిపివేత, చేసేందుకు పని లేకపోవటం వంటి పరిణామాలు సంభవించాయి. ప్రభుత్వం విశ్వసనీయత పోగొట్టుకుంది. ఇటీవల చమురు ధరలు 50శాతం పెరిగాయి, నిరుద్యోగం పది శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మిగతా దేశాల పాలకులు చెప్పినట్లే ధరల పెరుగుదలకు కరోనా, ఉక్రెయిన్‌ సంక్షోభం కారణమని అధ్యక్షుడు కార్టిజో తప్పించుకో చూశాడు. దేశం ఆరున్నరశాతం రేటుతో అభివృద్ది చెందుతున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఔషధాలను ఎందుకు సరఫరా చేయలేక పోతోందన్న ప్రశ్నకు జవాబు లేదు.
లాటిన్‌ అమెరికాలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పనామా ఒకటి. అది అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలతో అసమానత మరింత పెరిగింది. కరోనాతో జన జీవితాలు మరింతగా దిగజారాయి. ఆర్థిక అవినీతి సంగతి చూస్తే 2009 నుంచి 2019 వరకు 46 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను లు ఎగవేసిన వారి మీద ఎలాంటి చర్యలూ లేవు. ఒక్క 2019లోనే ఆరు బిలియన్‌ డాలర్ల మేరకు ఎగవేశారంటే ఇప్పుడు ఇంకా పెరిగిందన్నది స్పష్టం. ఇదంతా అనేక పన్ను రాయితీలు ఇచ్చిన తరవాత జరిగిన అవినీతి. ఒకవైపు జనజీవితాలు దిగజారుతుంటే ఎంపీల వేతనాలు పెద్ద మొత్తంలో పెంచటమే కాదు, అనేక మందికి లాభాలు పొందే కాంట్రాక్టులను అప్పగించారు. కొన్నేళ్ళుగా పెరుగుతున్న జీవన వ్యయానికి ఇటీవలి పరిణామాలు తోడై కార్మికుల్లో అసంతృప్తిని మరింత పెంచినట్లు వామపక్ష నేత, గత ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసిన సాల్‌ మెండెజ్‌ చెప్పాడు. పాలకులు అవినీతిని సంస్థాగతం గావించారని ప్రముఖ గాయకుడు, రచయిత రేబెన్‌ బేడ్స్‌ విమర్శించారు, ప్రజాధనాన్ని లూటీ చేశార న్నాడు. సంస్కరణలకు ఒక ప్రణాళికను ప్రకటించాలని ఐదు కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి.
పనామాలో తలెత్తిన ఆందోళనకు మూలం నూతన ఉదారవాద విధానాల పేరుతో ధనికులకు దోచి పెట్టే విధానపరమైనది తప్ప మరొకటి కాదు. లాటిన్‌ అమెరికాలో తనకు అనుకూలంగా ఉన్న వారిని అధికారంలో కూర్చోపెట్టిన గతం, వర్తమానం అమెరికాకు ఉంది. పనామా కూడా అలాంటిదే. పనామా కాలువను తన ఆధీనంలో ఉంచుకున్న అమెరికా అన్ని విధాలుగా లబ్దిపొందింది. కాలువ ప్రాంతంలో తన సైనిక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు పరిస్థితి మారింది. తదుపరి 2024లో జరగనున్న ఎన్నికలు కీలకంగా మారాయి. వామ పక్షాలు బలహీనంగా ఉన్నప్పటికీ జులైై నెలలో జరిగిన ప్రజా ఉద్యమాలు ఆ శక్తులు బలపడేందుకు దోహదం చేస్తాయనే భయాన్ని మితవాద శక్తులు ముందు గానే వెల్లడిస్తున్నాయి. లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాల్లో ప్రజా ఉద్య మాలు వామపక్ష శక్తులను ముందుకు తీసుకురావటం, జనం ఆదరించటమే దీనికి కారణం. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు ఇప్పటి మాదిరే కొనసాగితే 2024 పనామా ఎన్నికల్లో వామపక్షాలు ఒక ప్రధాన శక్తిగా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img