ముంబై : తన బ్యాటింగ్లో లోపాన్ని సరిచేసుకునేందుకు విరాట్ కోహ్లీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు ఫోన్ చేసి సలహా తీసుకోవాలని భారత వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. గత కొన్నాళ్లుగా బ్యాటింగ్లో తడబడుతున్న కోహ్లీ.. ఇంగ్లాండ్తో మూడో టెస్టులోనూ ఘోరంగా ఔటయ్యాడు. మూడో టెస్టు తొలి రోజు తర్వాత గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఆఫ్స్టంప్ ఆవల ఐదు, ఆరు, ఏడో స్టంప్ లైన్లో ఔటవ్వడం ఆందోళన కలిగిస్తోందన్నాడు. ‘‘ కోహ్లీ టెస్టు కెరీర్లో అండర్సన్కు వికెట్ ఇవ్వడం ఇది ఏడోసారి. గతంలో లైయన్ బౌలింగ్లోనూ ఏడుసార్లు ఔటయ్యాడు. ఆఫ్సైడ్ నాలుగు, ఐదో స్టంప్లైన్లో వెళ్తున్న బంతులకు అతడు ఔటవుతున్నాడు. కోహ్లీ వెంటనే సచిన్ తెందూల్కర్కు ఫోన్ చేయాలి. ఏం చేస్తే మంచిదో అతడిని అడగాలి. నాకిది ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అతడు ఐదు, ఆరు, ఏడో స్టంప్లైన్ బంతులకు ఔటవుతున్నాడు. 2014లో అతడు కేవలం ఆఫ్స్టంప్ మీదుగా వెళ్లే బంతులకు మాత్రమే ఔటయ్యేవాడు’’ అని గవాస్కర్ అన్నాడు. 2003-04లో సిడ్నీ టెస్టులో సచిన్ అనుసరించిన విధానాన్నే కోహ్లీ పాటిస్తే మేలని గవాస్కర్ అభిప్రాయపడుతున్నాడు.