న్యూదిల్లీ : టీ20 ప్రపంచకప్ 2021లో సూపర్ 12 రౌండ్ మ్యాచులకు ముందు భారత్ రెండు వార్మప్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఇటీవల ప్రకటించింది. అయితే భారత జట్టు ఆడే వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్లో ఐసీసీ తాజాగా మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. ఐసీసీ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18న ఇంగ్లండ్తో, అక్టోబర్ 20న ఆస్ట్రేలియాతో కోహ్లిసేన తలపడల్సి ఉంది. అయితే కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18న దుబాయ్లో టీమిండియా ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 20న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. కాగా భారత్ వార్మప్ మ్యాచ్లు ఆడబోయే వేదికలో కూడా ఐసీసీ మార్పు చేసింది. ఈ రెండు మ్యాచ్లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయని ముందుగా ప్రకటించిన ఐసీసీ.. అయితే తాజాగా దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్కు మార్పు చేసింది. కాగా ఇంగ్లండ్ జట్టు అక్టోబర్ 18న పాకిస్థాన్తో తమ మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబరు 17 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 24న భారత్ తన తొలి మ్యాచ్లో పాక్తో తలపడనుంది.