ముంబై: భారత క్రికెట్ జట్టును గాయాలు వీడటంలేదు. ఇప్పటికే గాయం కారణంగా కెప్టెన్ రోహిత్శర్మ బంగ్లాతో మూడో వన్డే, మొదటి టెస్టు రెండిరటికీ దూరమయ్యాడు. ఇప్పుడు అతడు రెండో టెస్టులో కూడా ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో స్లిప్స్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్శర్మ… ఎడ్జ్ తీసుకొని తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నంలో అది అతడి బొటనవేలిని బలంగా తాకింది. ఈ క్రమంలో క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటనవేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో స్కా నింగ్ కోసం పంపించారు. చేతికి కుట్లు కూడా పడినట్లు సమాచారం. ఆ తర్వాత జట్టు ఓటమి అంచుల్లో నిలిచినప్పుడు గాయం ఉన్నా కూడా బ్యాటింగ్ చేసేందుకు వచ్చా డు. దీంతో గాయం మరింత పెద్దదైనట్లు తెలుస్తోంది. గాయంతో ముంబై చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకున్నాడు. మూడో వన్డేలోనూ ఆడలేదు. అలాగే తొలి టెస్టుకు కూడా దూరమయ్యా డు. అతడి స్థానంలో యువబ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేశారు. ఇప్పటికీ రోహిత్ గాయం పూర్తిగా మానలేదని తెలుస్తోంది. ఇంకా అతడి బొటన వేలు నొప్పిగానే ఉందని, గట్టిగా పట్టేసినట్లుగా ఉందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగోలా రోహిత్ బ్యాటింగ్ చేసినా… ఫీల్డింగ్ సమయంలో ఈ గాయం మరింత పెద్దదిద్ద అయ్యే ప్రమాదం ఉన్నందున రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా రోహిత్ రెండో టెస్టుకు దూరమైనట్లు అధికారికంగా ప్రకటన రానప్పటికీ బీసీసీఐ దాదాపు ఇదే నిర్ణయం తీసుకుందని సమాచారం. దీంతో రెండో టెస్టులో కూడా కేఎల్ రాహులే జట్టుకు నాయకత్వం వహిస్తాడు. దీంతో తొలి టెస్టులో మొదటి టెస్టు సెంచరీ సాధించిన శుభమన్ గిల్కు రెండో టెస్టులో కూడా అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యం లోనే రోహిత్కు పూర్తి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్కు రోహిత్ మళ్లీ జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.