: ప్రభుత్వ విప్ బాల్క సుమన్
నీతి నిజాయితీ అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విధంగా కబ్జా చేశారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఎమ్మెల్యే ముఠా వేణుగోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్తో కలిసి టీఆర్ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. ఈటల రాజేందర్ భార్యకు చెందిన జమున హచరిస్ భూములను ఎలా కబ్జా చేసిందో మెదక్ కలెక్టర్ ఆధారాలతో సహా చూపించారని, తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలన్నారు. కబ్జాలు చేసి, నోరు లేని పేదల భూములను లాక్కుని మళ్ళీ వీల్లే దొంగే దొంగ అన్నట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలన్నారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు. అక్కడి కలెక్టర్ నిజాయితీగా పని చేస్తున్నాడని, కానీ ఆయనను భయపెట్టే చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యాయో కలెక్టర్ నిగ్గు తేల్చాలన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ… 71 ఎకరాలు కబ్జా చేసాడంటే ఈటెల 71 సార్లు ముక్కు నేలకు రాయాలన్నారు. ఇన్ని ఎకరాలు కబ్జా చేసిన ఈటలను బీజేపీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్లను ఈటెల బెదిరిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్న ఈటల రాజేందర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.