పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి వస్తే ఆయనకే మునుగోడు టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కాంగ్రెస్ తరఫున రాజగోపాల్ రెడ్డికి బీ ఫామ్ ఇవ్వడంతో పాటుగా సీనియర్ నేతలంతా కలిసి ఆయనను మునుగోడు ఉప ఎన్నికలో గెలిపించుకుంటామని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో భాగంగా శనివారం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఆ పార్టీ కండువా కప్పుకున్నప్పుడే పండగ అని వ్యాఖ్యానించిన రేవంత్… బీజేపీలో ఎల్కే అద్వానీ, వెంకయ్యనాయుడుల పరిస్థితి అందుకు నిదర్శనమని తెలిపారు. పార్టీ మారి బీజేపీలోకి వెళ్లిన చాలా మంది సీనియర్ నేతలకు సరైన ప్రాధాన్యమే దక్కలేదని ఆయన అన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్లో స్టార్ క్యాంపెయినర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి… ఎన్నికల ప్రచారంలో వెంకట్ రెడ్డి తప్పనిసరిగా పాలుపంచుకుంటారని చెప్పారు.