రాష్ట్ర ఏర్పాటు తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పటికీ తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, కేంద్రంలోని బీజేపీ తెలంగాణ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ,నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాల్సిన బాధ్యత మున్సిపల్ మంత్రిగా నా పై ఉందని, రూ.936.69 కోట్లతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇవికాక సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చినపుడు రూ.100 కోట్ల నిధులు నిజామాబాద్ అభివృద్ధి కోసం ఇచ్చారని, ఈ నిధులను క్షుణ్ణంగా ఆలోచించి కర్చు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించామని, ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయనున్నామన్నారు. నిజామాబాద్ పట్టణం కళాకారులకు, కవులకు పెట్టింది పేరు, ఇందూరు కళాభారతి అనేది ఒక అపురూప క్షేత్రం అన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారు. ఇక్కడ మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నామని, నిజామాబాద్ ను ఐటీ హబ్ గా మారుస్తున్నామన్నారు. వచ్చే నెలలో ఐటీ హబ్ ప్రారంభిస్తామన్నారు. పలు శిక్షణ కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. అన్ని మున్సిపాలిటీ లకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తుమని, రాష్ట్ర ప్రభుత్వం ఎం చేసింది ఎవ్వరినీ అడిగిన చెప్పాలన్నారు. కానీ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రం నుండి ఎన్ని నిధులు కేటాయించారో ఎంపీ అరవింద్ చెప్పాలన్నారు. మోదీ నాయకత్వంలో ఈ బడ్జెట్ చివరి బడ్జెట్ కానుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మోదీ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వలేదు అన్నారు. రాష్ట్ర విద్యార్థులు యువత ఆలోచన చేయాలి.. కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. విభజన చట్టం హామీలను ఇప్పటికీ నెరవేర్చని దుర్మార్గపు కేంద్రం ప్రభుత్వం తీరును గమనించాలన్నారు. మీ చిత్త శుద్ధిని చాటుకోవడానికి ఈ బడ్జెట్ చివరి అవకాశం, అందుకే ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రాన్ని ప్రశ్నించాలి అన్నారు.