రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. హౖదరాబాద్ పార్లమెంట్ పరిధిలో రూ. 495 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలో కూడా మతం పేరిట రాజకీయాలు చేయలేదు.. పనికిమాలిన పంచాయతీలు లేవు అని అన్నారు. కొన్నేండ్ల క్రితం హైదరాబాద్లో ప్రతి ఏడాది ఐదు నుంచి పది రోజుల పాటు కర్ఫ్యూ విధించేవారు. కానీ కేసీఆర్ నాయకత్వంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుకుంటున్నామని తెలిపారు. మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒకే ఒక్క రోజు రూ. 495 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గతంలో మోజాం జాహీ మార్కెట్ను చూసి బాధపడేవాళ్లం. ఇప్పుడు మోజాం జాహీ మార్కెట్ను అభివృద్ధి చేశామన్నారు. కులీకుత్బ్షా అర్బన్ డెవలప్మెంట్కు పూర్వ వైభవం తీసుకువస్తాం. వారసత్వ సంపదను కాపాడుకుంటామని అన్నారు.