తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాట్లాడుతూ, రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న వారికి సేవ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బాలరాజ్ యాదవ్ కు కల్పించారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదవుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. గొల్ల, కుర్మలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం లో భాగస్వాములైన ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుండగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఎండి రాంచందర్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా తదితరులు పాల్గొన్నారు.