సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, విద్యుత్ సంస్కరణల పై సీఎం కేసీఆర్ చేసిన వాదన తప్పు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటున్నారు. ఒప్పు అని మేము అంటున్నాం. వారిద్దరూ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.. కేంద్రం ఏప్రిల్ 27, 2021 నాడు విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని, దశల వారిగా అన్ని రంగాల్లో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని ఆ పాలసీలో స్పష్టంగా ఉందని చెప్పారు. ఆర్థిక సాయానికి కేంద్రం విద్యుత్ సంస్కరణలతో ముడి పెట్టిందన్నారు. కేంద్రం చెప్పినట్టుగా విద్యుత్ సంస్కరణలకు ఒప్పుకోక పోవడం వల్ల తెలంగాణ ఏటా రూ. 5 వేల కోట్లు నష్టపోతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు. కేసీఆర్ భాష గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగాం ఉందన్నారు. మంత్రి. బీజేపీ నేతలు ఎలాంటి భాష వాడుతున్నారో కిషన్ రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు.కిషన్ రెడ్డి మాట్లాడిన తీరు చూసి జనం నవ్వుకుంటున్నారని అన్నారు. కిషన్ రెడ్డితో చర్చకు టీఆర్ఎస్ కార్యకర్త కూడా అవసరం లేదు.. తన నియోజకవర్గంలోకి వెళ్లి సాధారణ ఓటరును అడిగినా కేంద్రం ఏం ఒరగబెట్టిందో చెబుతారు అని అన్నారు.