రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాడలేరని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరుద్యోగుల కోసం దీక్ష చేపట్టిన ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 54 లక్షల నిరుద్యోగులు ఉన్నారన్నారు. ఉద్యోగాలు ఇస్తాం లేకుంటే భృతి ఇస్తామని చెప్పిన సీఎం మాటలు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు. యువత ఉద్యోగాలు లేక చేసుకున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల ప్రాంత వాసి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించని ఆయన ఒక మంత్రియేనా అని మండిపడ్డారు. తాము ఎప్పటికీ ప్రజల పక్షాన ఉంటామని సమస్యల కోసం పోరాడుతామని అన్నారు.