తెలంగాణలో ఉన్న వాతావరణం వేరు శనగ, పెసలు, మినుములు, శనగలు, నువ్వులు, ఆముదములు, సజ్జలు, నూనె గింజల పంటలకు యాసంగిలో సాగుకు అనువుగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు, నూనెగింజల సాగుకు అవసరమైన విత్తనాలను సరిపడా సేకరించి రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విత్తన కంపెనీలకు సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రాష్ట్రంలోని 36 విత్తన కంపెనీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్. కే.ఆర్. భవన్లో సమావేశం నిర్వహించారు. ఎఫ్. సి.ఐ. నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయం పంటల సాగుపై చర్చించుటకు అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యానవనం శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 2603 రైతువేదికల ద్వారా ఈ నెల 27, 28, 29 తేదీలలో రైతులకు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన సదస్సులు నిర్వహించనునట్లు తెలిపారు.