అంబేద్కర్ అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఒక్క ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాదన్నారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గ్రామాల్లో భూమి అమ్మే వాళ్ళు లేరని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తు చేశారు. మొదటి న్యాయ శాఖ మంత్రి అయ్యాక దళితులకు రిజర్వేషన్లు కల్పించింది కూడా బాబాసాహెబ్ అని కొనియాడారు.ఈ రోజు మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామంటే..ఆ పుణ్యం అంబేద్కర్దే అన్నారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నాడని పేర్కొన్నారు. రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని దళిత వాడల అభివృద్ధి చేస్తామన్నారు.దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసమే దళిత బంధు పథకమన్నారు. కార్యక్రమంలో హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.