తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో గురువారం శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనమండలి ప్రోటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు.ఈసందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో మాదిరిగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు. సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. గత సమావేశాలకు సంబంధించిన పెండిరగులో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలన్నారు. సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గతంలోని ఏడు సమావేశాలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగాయి, ఈసారి కూడా అదేవిధంగా జరగడానికి పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలని కోరారు.