ఎన్టీఆర్ పేరు తొలగింపుపై కొడాలి నాని, వల్లభనేని వంశీలకు తాడేపల్లి ప్యాలస్ ముందు ధర్నా చేసే దమ్ముందా అని టీడీపీ నేత పట్టాభి ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్ దుర్మార్గాన్ని ప్రశ్నించలేని వారికి ఎన్టీఆర్ పేరును కూడా ఉచ్ఛరించే అర్హత లేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పెడతామని అన్నారు. రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారుణమని చెప్పారు. రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఏ2 విజయసాయిరెడ్డికి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని… వీటిలో చంద్రబాబు హయాంలో 4 మెడికల్ కాలేజీలు వచ్చాయని తెలిపారు. జగన్ మాత్రం 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయంటూ అబద్ధాలు చెపుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరును మార్చుతూ అసెంబ్లీలో బిల్లును తీసుకురావడం రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజు అని అన్నారు. కరోనా సమయంలో రోగులకు ఆక్సిజన్ అందించలేక 110 మంది ప్రాణాలను బలితీసుకున్న జగన్ కు ఆరోగ్యం గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు.