ఆసిఫాబాద్ ప్రాంతం అంటే ఒకప్పుడు ఎలాంటి వైద్య సదుపాయాలు ఉండేవి కావని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఏ అనారోగ్యం వచ్చినా హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్కు పోవాల్సిన అవసరం లేకుండా గాంధీ, ఉస్మానియా స్థాయి వైద్యం ఇక్కడ అందిస్తామని చెప్పారు. త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 60 కోట్ల రూపాయలతో అధునాతన దవాఖాన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. శుక్రవారం జిల్లాలో మంత్రి ఐకేరెడ్డి తో కలిసి హరీశ్ రావు పర్యటించారు. జైనూర్, కెరమెరి దవాఖానలను తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలో 60 కోట్ల రూపాయలతో 340 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో 3 వైద్య కళాశాలలు ఉంటే తెలంగాణ ఏర్పడిన 7 సంవత్సరాల్లో 15 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు.జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు.