రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్
కొవిడ్ వ్యాప్తి పూర్తిగా పోలేదని, రానున్న మూడునెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్ సూచించారు. కోఠిలోని ఆయన కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదన్నారు. హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదని తెలిపారు. గత ఆరువారాలుగా కరోనా అదుపులోనే ఉందన్నారు. కొన్ని చోట్ల ఫోర్త్వేవ్ ప్రారంభమైందన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్ ఎక్స్ఈ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చని తెలిపారు. 2022 నాటికి కొవిడ్ పూర్తిగా ఫ్లూ లా మారే అవకాశముందని అన్నారు. థర్డ్వేవ్, వస్తుందో రాదో తెలియని ఫోర్త్వేవ్ నుంచి ప్రజలు బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందేనని, అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.