ముంబై : ఆర్యన్ఖాన్పై డ్రగ్స్ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. దర్యాప్తులో భాగంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు గురువారం బాలీవుడ్ అగ్రహీరో షారూక్ఖాన్ నివాసంపై దాడులు చేశారు. బాంద్రాలో ఉన్న షారూక్ నివాసం మన్నత్కు ఎన్సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించారు. అలాగే బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే ఇంటికి కూడా ఎన్సీబీ బృందం చేరుకుంది. సీనియర్ నటుడు చుంకీ పాండే కుమార్తె అయిన అనన్య.. ఆర్యన్కు స్నేహితురాలు. ఆర్యన్ ఫోన్ చాటింగ్లో అనన్య పేరు ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ముంబైలోని ఖార్ వెస్ట్లో ఉన్న ఆమె ఇంటిపై కూడా ఎన్సీబీ అధికారులు దాడులు చేశారు. ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న కుమారుడిని షారూక్ కలిసిన కొద్ది గంటలకే ఈ దాడులు జరిగాయి. గురువారం ఉదయం జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ను 19 రోజుల తర్వాత షారూఖ్ ఖాన్ కలిసేందుకు వచ్చాడు. కుమారుడితో మాట్లాడి తిరిగి వెళ్లిన కాసేపటికే ఎన్సీబీ అధికారులు రaలక్ ఇచ్చారు. ఆయన నివాసంలో దాడులు చేపట్టారు. అదే సమయంలో అనన్య పాండే నివాసంలో కూడా దాడులు చేపట్టి.. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.